తలలు పట్టి, సిగ్గునొగ్గి, డబ్బు మరిగి
రాజకీయ రాజ దర్బారులో.. ఓటు కొరకు మంత్రాంగం.
కలలు కరిగి, ఆస్తులు తరిగి, చేవజచ్చిన
పేద రైతు ఓటరు దగ్గరకు కదిలె, అధికార, ప్రతిపక్ష యంత్రాంగం.
వంద నోటు, చికెను ముక్క, సారా చుక్క ఆశ చూపి,
అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా నీ సేవనే అని నమ్మ బలికి
ఆకాశాన్ని వంచి, నీ నేలను తడుపుతామని,
నేలను వున్నా తన ఇంటిని ఆకాశంలో కట్టిస్తామని...
ఒకటా.. రెండా... ఎన్నెన్నో .. వాగ్దానాలు...
ఈ వాగ్దానాల వరదకు, దిమ్మదిరిగిన సగటు ఓటరు,
ఏ గుర్తుకు ఓటు వేయాలో తెలియని తికమకలో...
ఏదో.. గుర్తుకి ఓటు వేసి... గెలిచిన పార్టీదే.. తన ఓటంటాడు.
సదరు నాయకుడు, గద్దెనెక్కాక గాని తెలియదు,
గతి తప్పిన తన ప్రస్తుత స్థితి గురించి.
తెలివి వచ్చి, తేరుకున్నాక తెలిసింది... యిచ్చిన వాగ్దానాలు
గతించిన కాలంలోనే... భూస్థాపితం అయ్యాయని.
చేసేదేమీలేక... చతికిలబడి, మళ్ళీ అయిదేళ్ళ కోసం ఎదురు చూపు...
ప్రచారం రోజు కాబోయే... "ఒక్కరోజు మారాజు".
---గోపి బుడుమూరు.